బెంగళూరు, అక్టోబర్ 11 : తన స్నేహితురాలిని కలవడానికి వెళ్తున్న ఓ వ్యక్తిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసి హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. ఒడిశాకు చెందిన ప్రణయ్ మిశ్రా(28) బెంగుళూరులోని ఓ ప్రముఖ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అతను సోమవారం తెల్లవారుజామున తన స్నేహితురాలిని కలవడానికి వెళ్తున్న క్రమంలో... బైకుపై ఇద్దరు వ్యక్తులు వచ్చి నడిరోడ్డుపై దారుణంగా కత్తితో పొడిచి అక్కడ నుంచి పారిపోయారు. ప్రణయ్ పనిచేసే ఆఫీసుకు సమీపంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు రక్తపు మడుగులో ఉన్న ప్రణయ్ ని గమనించి వెంటనే ఆస్పత్రికి తరలించగా, అప్పటికే అతను మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ప్రణయ్ ఫోను, ఇతర వస్తువులు తన జేబులోనే ఉన్నాయని, వాటి ద్వారానే అతన్ని గుర్తించామని పోలీసు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.