పాట్నా, అక్టోబర్ 11 : కశ్మీర్ భారతదేశంలో భూభాగం కాదట. మరే౦టి అని ఆశ్చర్యపోతున్నారా..? అది ఒక దేశం అంటోంది బీహార్ విద్యాశాఖ. విషయం ఏంటంటే.. బీహార్ లో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోని ఏడో తరగతి విద్యార్థులకు నిర్వహించిన పరీక్షలో కశ్మీర్ను భారత్లో భాగంగా కాకుండా దాన్నొక దేశంగా పరిగణిస్తూ ఒక ప్రశ్నాపత్రాన్ని తయారు చేశారు. ఓ ఐదు దేశాల పేర్లను ఇచ్చి ఆ ప్రాంతాల్లో నివసించే ప్రజలను ఏమని పిలుస్తారని ప్రశ్నించింది. అందులో చైనా, నేపాల్, ఇంగ్లాండ్, భారత్తో పాటు కశ్మీర్ను చేర్చింది. ఈ విషయాన్ని గమనించిన ఓ విద్యార్థి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళాడు. ఈ విషయంపై స్పందించిన బిహార్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు కౌన్సిల్ (బీఈపీసీ) స్టేట్ ప్రొగామ్ అధికారి ప్రేమ్చంద్ర.. బహుశా అది ప్రింటింగ్ వలన వచ్చిన తప్పిదం అని చెప్పుకొచ్చారు. ఇదివరకే హాల్టికెట్లలో తప్పుడు సమాచారం, తప్పుడు ఫొటోలు వస్తూ వార్తల్లోకెక్కిన బిహార్ ప్రభుత్వం.. మరోసారి కశ్మీర్ ఒక దేశమంటూ వార్తల్లో నిలిచింది.