అమరావతి, అక్టోబర్ 11 : ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో ఆరు గంటలపాటు సాగిన మంత్రి వర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా ముస్లిం మహిళలకు దుల్హాన్ పేరిట పెళ్లికానుకలను అందిస్తున్న ఏపీ ప్రభుత్వం, వెనుకబడిన వర్గాల్లోని (బీసీలు) పేదలకు పెళ్ళికానుకగా రూ.30వేలను అందించేందుకు ప్రతిపాదనలను పరిశీలిస్తున్నారు. వెనుకబడిన తరగతులకు చెందిన నూతన వధూవరులకు పెళ్ళి సమయంలో ఆర్ధిక సహాయాన్ని అందించే ఈ కొత్త పథకానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. "చంద్రన్న పెళ్లికానుక" పేరుతో వచ్చే ఏడాది జనవరి ఒకటవ తేదీ నుండి ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. ఈ పథకానికి తెల్లరేషన్ కార్డు ఉన్నవారు, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న బీసీ కులాలవారు అర్హులు. అబ్బాయికి 21 సంవత్సరాల వయస్సు, అమ్మాయికి 18 సంవత్సరాల వయస్సు ఉండాలన్నది నిబంధన. ఇందుకోసం రూ. 120 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేయనుంది. ఇక నుండి జనన, మరణాలతో పాటు వివాహ నమోదు తప్పనిసరి చేయాలంటూ అధికారులను ఆదేశించారు.