హైదరాబాద్, జూన్ 7 : గత ఆరు సంవత్సరాలుగా శీతల పానీయాల సంస్థ పెప్సీ కోకు ప్రచారకర్తగా వ్యవహరించిన భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఇకపై ఆ సంస్థకు ఎలాంటి ప్రచారం చేయకూడదని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు.. ఇకపై తాను వాడే లేదా తను వాడే ఉత్పత్తులతో సంబంధించిన ప్రొడక్టులకు మాత్రమే ప్రచారం చేస్తానని, తాను తాగని పెప్సీ డ్రింక్స్ ను ఇతరులకు తాగమని సిఫార్సు చేయబోనని ఈ సందర్భంగా కోహ్లీ వ్యాఖ్యానించడం గమనార్హం. "అటువంటి పానీయాలను నేను తాగకపోవడంతో పాటు ఇతరులను కూడా కేవలం డబ్బు కోసం వాటిని తాగమని చెప్పలేను" అని సీఎన్ఎన్ - ఐబీఎన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కోహ్లీ వ్యాఖ్యానించాడు. ఇకపై ఆ సంస్థ ప్రమోషన్ లో భాగం కాదలచుకోలేదని స్పష్టం చేశాడు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం కోహ్లీ టీ-20లో వరల్డ్ నంబర్ వన్ గా, వన్డేల్లో వరల్డ్ నంబర్ త్రీగా, టెస్టుల్లో వరల్డ్ నంబర్ ఫైవ్ గా కొనసాగుతున్నవిషయం తెలిసిందే. ఆరేళ్లుగా పెప్సీ నుంచి కోట్లాది రూపాయలను తీసుకుని బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగిన కోహ్లీ, ఉన్నటుండీ అకస్మాత్తుగా కాంట్రాక్టు రద్దు చేసుకోవడం వెనుక ఏదో బలమైన కారణం ఉండవచ్చునని పలు ఆలోచనలు వెల్లువిరుస్తున్నాయి.