న్యూఢిల్లీ, అక్టోబర్ 10 : భారత్ లో ఇంధన రంగం పరిస్థితి ఎంతో అస్తవ్యస్తంగా ఉందని ఈ రంగంలో అనేక సంస్థలకు ఆస్కారం ఉందని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశ, విదేశాలకు చెందిన చమురు, సహజ వాయువు సంస్థల సీఈఓలతో ఢిల్లీలో సమావేశమైన మోదీ ఇంధన రంగల స్థితి గతులపై విస్తృతంగా చర్చించారు. సమగ్ర ఇంధన విధాన రూపకల్పనకు సూచనలు చేయాలని కోరారు. చమురు, సహజ వాయువు రంగంలో సృజన పరిశోధనకు ఉన్న అవకాశాలన్నింటినీ సద్వినియోగం చేసుకోవాలని రిలయన్స్, బీపీ, రాస్నెఫ్ట్ వంటి దిగ్గజ సంస్థల సారథులకు ప్రధాని సూచించారు. తూర్పు భారతంలో ఇంధన రంగ మౌలిక వస్తువులు అభివృద్ధి చేయాలని ఆదేశం చేశారు. భారత్ ను శుద్ధమైన, మరింత సమర్ధమైన ఇంధన వ్యవస్థగా మలిచి, తద్వారా కలిగే లాభాలని పేదలు సహా అన్ని వర్గాల వారికి అందించాలన్నదే తమ ఆకాంక్ష అని మోదీ వివరించారు. ప్రభుత్వం ఇప్పటి వరకు చేపట్టిన సంస్కరణలను స్వాగతించిన చమురు సంస్థల సారథులు విద్యుత్ గ్యాస్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని గట్టిగా సిఫార్సు చేశారు. ఒపెక్ సెక్రటరీ జనరల్ మహమ్మద్ బర్కిందో, చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, మాజీ చమురు కార్యదర్శి లు వివేక్ రే, విజయ్ కేల్కర్లు సైతం సమావేశాల్లో పాల్గొన్నారు.