హైదరాబాద్, అక్టోబర్ 10: తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం 67 మందితో నూతన కార్య వర్గాన్ని ఏర్పాటు చేశారు. కమిటీ అధ్యక్షుడు కేసీఆర్ పార్టీ సెక్రటరీ జనరల్ గా ఎంపీ కె. కేశవరావును నియమించారు. 20 మంది ప్రధాన కార్యదర్శులు, 33 మంది కార్యదర్శులు, 12 మంది సహాయ కార్యదర్శులుగా నియమితులయ్యారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా జె. సంతోష్ కుమార్ కు ఈ వర్గంలో కొత్తగా చోటు దక్కింది. పార్టీ పనితీరును మరింతగా మెరుగుపరిచేందుకు 40 మంది సభ్యులకు ఒక్కొక్కరికి మూడు నియోజకవర్గాల కేటాయింపునకు సీఎం నిర్ణయం తీసుకున్నారు. 12 మంది ప్రధాన కార్యదర్శులు ఒక్కొక్కరికి పదేసి నియోజకవర్గాల పర్యవేక్షణ బాధ్యత అప్పగిస్తారు. పార్టీ కేంద్ర కార్యాలయ నిర్వహణతో పాటు పార్టీ అనుబంధ సంఘాల బాధ్యతలు, శిక్షణ శిబిరాలు, ఇతర కార్యకలాపాల నిర్వహణ బాధ్యతను మిగతా ప్రధాన కార్యదర్శులకు అప్పగిస్తారు. కాగా, మొత్తం 69 మందితో కమిటీ ఏర్పాటుకు నిర్ణయించిన ఆయన 67 మందితో జాబితాను విడుదల చేశారు. మరో ఇద్దరిని త్వరలో నియమిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమాలను త్వరలో ముమ్మరం చేస్తామని ఈ మేరకు సీఎం ప్రకటించారు