గువహతి, అక్టోబర్ : వరుస విజయాలతో ఊపు మీద ఉన్న టీంఇండియా.. ఆసీస్ తో మరో సమరానికి సిద్ధమవుతుంది. మూడు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా ఈరోజు సాయ౦త్రం రెండో T–20 7.గంటలకు గువహతిలోని బర్సపర స్టేడియంలో జరగనుంది. ఈ స్టేడియాన్ని కొత్తగా నిర్మించారు. కాగా ఇక్కడ ఇదే తొలి అంతర్జాతీయ మ్యాచ్ కావడం విశేషం. ప్రస్తుతం భారత్ జట్టులో ఆటగాళ్లు మంచి ఫాం కొనసాగిస్తుండగా ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ ను కైవసం చేసుకోవాలనే దృఢసంకల్పంతో కోహ్లి సేన ఎదురుచూస్తోంది. మొదటి మ్యాచ్ ని అలవోకగా గెలిచినా, టీంఇండియాను ఎదుర్కోవడం ఆసీస్ కు పెద్ద సవాలే. స్మిత్ గైర్హాజరుతో బ్యాటింగ్ బాధ్యత వార్నర్, ఫించ్, మీదే ఆధారపడి ఉంది. ఆసీస్ ముందు నుండి భారత్ బౌలింగ్ ని ఎదుర్కోవడ౦లో ఇబ్బందులు ఎదుర్కొంటుంది. పేసర్లు హార్దిక్, బుమ్రా ధారాళంగా పరుగులిచ్చినప్పటికీ సరైన సమయంలో వికెట్లను తీస్తున్నారు. స్పిన్నర్స్ కులదీప్, చాహల్ బౌలింగ్ ను అడ్డుకోవడం కంగారుల వల్ల కావట్లేదు. ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ లు అన్ని ఏకపక్షంగా సాగినా.. ఆసీస్ ను తక్కువ అంచనా వేయకూడదు. ఎందుకంటే వరస పరాజయాలతో ఆసీస్ కసితో ఉంది. భారత్ జట్టులో ఎటువంటి మార్పు ఉండకపోవచ్చు. ప్రత్యర్ధి జట్టులో వరుసగా విఫలమవుతున్న మాక్స్వెల్ బదులు హెన్రిక్స్ ని భర్తీ చేయవచ్చు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే కోల్టర్ నైల్ ఒక్కడే భారత్ను ఇబ్బంది పెడుతున్నాడు. వన్డే సిరీస్లో అతను 10 వికెట్లు తీశాడు. ఆల్రౌండర్ స్టొయినిస్ కూడా మెరుగైన ఆటతీరు కనబరుస్తున్నాడు. వర్షంతో కుదించుకుపోయిన తొలి టి20లో పెద్దగా ఎవరికీ బౌలింగ్ చేసే అవకాశం లేకపోయింది. మరో 38 పరుగులు చేస్తే విరాట్ కోహ్లి అంతర్జాతీయ టి20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానానికి చేరుకుంటాడు.