రాజేంద్రనగర్, అక్టోబర్ 10: ఈ మధ్య కాలంలో మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తూ కొంత మంది సినీ నటులు పోలీసుల చేతికి చిక్కుతున్నారు. ఈ నేపధ్యంలో సీనియర్ నటుడు రాజశేఖర్ ఆగి ఉన్న కారును ఢీ కొట్టారు. ఈ ఘటన ఆదివారం అర్ధరాత్రి శంషాబాద్ విమానాశ్రయం వద్ద చోటు చేసుకుంది. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరగడంతో బాధితుడు రాం రెడ్డి, రాజేంద్రనగర్ ఠాణా పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు వారిద్దరినీ ఠాణాకు తీసుకెళ్లారు. రాజశేఖర్ మద్యం మత్తులో ఉన్నాడంటూ బాధితుడు రాం రెడ్డి ఆరోపించాడు. ఆయనకు బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు నిర్వహించి, మద్యం తాగలేదని ట్రాఫిక్ పోలీసులు నిర్ధారించారు. ఈ విషయం తెలుసుకున్న జీవిత, ఠాణాకు చేరుకొని బాధితుడు రాం రెడ్డి తో... తల్లి చనిపోయిన బాధలో రాజశేఖర్ తీవ్రమైన దిగ్భ్రాంతిలో ఉన్నారని వివరించింది. ఆయన ఒత్తిడిలో ఉండడం వల్లే ఇలా జరిగిందని రాం రెడ్డి తన ఫిర్యాదును వెనక్కి తీసుకున్నారు.