న్యూఢిల్లీ, అక్టోబర్ 09: స్వచ్ఛ్ భారత్, జీఎస్టీ, పెద్ద నోట్ల రద్దు వంటి చర్యలు ఆశించిన ఫలితాలను ఇస్తున్నాయని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. పన్ను పరిమితిని పెంచి ఆర్థిక వ్యవస్థలో నగదు పరిమాణాన్ని తగ్గించే దిశలో జీఎస్టీ, పెద్ద నోట్ల రద్దు సానుకూల ప్రభావం చూపాయని బర్కిలీ ఇండియా సదస్సును ఉద్దేశించి ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చేసిన ప్రసంగంలో చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంస్కరణలకు ప్రజల మద్దతు లభిస్తుందన్నారు. స్వచ్ఛ్ భారత్, జీఎస్టీతో క్షేత్ర స్థాయిలో మార్పులు రాలేదన్న వాదనలను జైట్లీ తోసిపుచ్చారు. ఆయా ప్రాజెక్టులా ద్వారా కొన్ని నెలల్లోనూ సానుకూల మార్పులు వచ్చాయని స్పష్టం చేశారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా భారత ఆర్థిక వ్యవస్థ త్వరలోనే తిరిగి పుంజుకుంటుందని ఆర్థికమంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. మరో వైపు జైట్లీ నేటి నుంచి అమెరికాలో పర్యటించనున్నారు. న్యూయార్క్ పలువురు సీఈవోలతో సమావేశం కానున్నారు. బోస్టన్లో భారత ఆర్థిక వ్యవస్థపై జరిగే చర్చలో పాల్గొంటారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో భారత పన్ను వ్యవస్థపై ప్రసంగిస్తారు. 12న వాషింగ్టన్లో ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థల వార్షిక సదస్సుల్లో హాజరు కానున్నారు.