హైదరాబాద్, అక్టోబర్ 9 : బీజేపీ మహిళానేత దగ్గుబాటి పురందేశ్వరి బీజేపీతో కలిసి పోటీ చేసే అంశం గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ బీజేపీకి మిత్రుడేనని, ఇతర పార్టీలతో పొత్తుకు తామెప్పుడు సిద్ధంగానే ఉంటామని తెలిపారు. ఈ విషయం గురించి నిర్ణయం తీసుకోవాల్సింది పవన్ కళ్యాణ్ అని స్పష్టం చేశారు. కాగా పోలవరం ప్రాజెక్టును కేంద్రానికి అప్పగిస్తే పనులు త్వరగా పూర్తయ్యేవని ఆమె అభిప్రాయపడ్డారు. వచ్చే ఎన్నికల వరకైనా పోలవరం స్పిల్ వే, కాపర్ డ్యామ్ తదితరాల నిర్మాణం పూర్తవుతుందో.. లేదో అని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. నోట్ల రద్దు, జీఎస్టీ వంటి సంస్కరణల తరువాత జాతీయ నాయకత్వం పడిపోయిందని వస్తున్న విమర్శలను ఆమె కొట్టిపారేశారు. దేశాభివృద్దే లక్ష్యంగా మోదీ ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తుందని తెలిపారు. అంతేకానీ వచ్చే ఎన్నికల కోసం మోదీ నిర్ణయాలు తీసుకోవడం లేదని వెల్లడించారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ మంచి ఫలితాలను సాధించడమే కాకుండా కర్ణాటక, ఏపీ కేరళలో మరింత బలపడతామని పేర్కొన్నారు.