ఆంధ్రప్రదేశ్, అక్టోబర్ 8: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత ఎన్నికల సమయంలో రైతులకు రుణమాఫీ పథకాన్ని ప్రవేశ పెట్టిన విషయం అందరికి తెలిసిందే. ఈ పథకంలో భాగంగా చంద్రబాబు శనివారం ఉదయం తమ నివాసం నుంచి టెలి కాన్ఫరెన్స్ ను నిర్వహించి బ్యాంకు, వ్యవసాయ,రెవెన్యూ శాఖల అధికారులతో మాట్లాడారు. ఈ నెల 9వ తేది నుంచి రుణమాఫీ సొమ్మును 10% వడ్డీతో కలిపి రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నామని అందరూ సమన్వయంతో పనిచేసి రుణ ఉపశమన పత్రాలు రైతులందరికీ అందేటట్టు చేయమన్నారు. రుణమాఫీ కోసం అయ్యే ఖర్చును రిజర్వ్ బ్యాంకు సహకారం లేకున్నా ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. ప్రస్తుతం ఇచ్చే మూడో విడత నిధులతో కలిపి మొత్తం రూ.14 వేల కోట్లు అవుతుందని వెల్లడించారు. కష్టాల్లో ఉన్న రైతును ఆదుకోవడమే లక్ష్యంగా పని చేస్తామని అన్నారు. కర్నూలు జిల్లా లో తంగేడంచలో సీడ్ పార్క్ కు శంకుస్థాపన చేస్తున్నామని వెల్లడించారు. ఈ పార్క్ లో 100 పైగా అంతర్జాతీయ విత్తన సంస్థలు వస్తాయన్నారు.