హైదరాబాద్,అక్టోబర్ 8 : పెద్ద నోట్ల రద్దు తరువాత ప్రజలందరూ నగదు రహిత లావాదేవీలు చేయాలని ప్రభుత్వం సూచించింది. ఈ నేపధ్యంలో....సిద్ధిపేట జిల్లాలోని ఇబ్రహీంపూర్ గ్రామం నగదు రహిత లావాదేవీలు చేసి పలు అవార్డులను అందుకుంది. ఆ గ్రామానికి కూడా ఇప్పుడు కష్టాలు తప్పడం లేదు. పీవోఎస్(పాయింట్ ఆఫ్ సేల్) యంత్రాల నిర్వహణ పేరుతో బ్యాంకులు తమ వద్ద నుండి వసూల్ చేస్తున్న చార్జీలకు గ్రామీణ వ్యాపారస్తులు భయపడుతున్నారు. ఈ కారణంగా నూరు శాతం నగదు రహిత లావాదేవీలు నిర్వహించిన ఇబ్రహీంపూర్ సగానికి తగ్గిపోయాయి. గ్రామస్థులు ఏటీఎం కార్డుల ద్వారా లావాదేవీలు చేయడానికి సిద్దంగా ఉన్నా, వ్యాపారస్తులు మాత్రం వెనకడుగు వేస్తున్నారు. " లావాదేవీలు జరిగిన తరువాత నాలుగు రోజులకు గానీ నగదు తమ అకౌంట్ ల్లోకి జమ కావడం లేదని" వాపోతున్నారు. ఇది కూడా వ్యాపారుల అనాసక్తికి కారణమైంది. పీవోఎస్ యంత్ర నిర్వహణ అందరూ ఉచితమని భావించారని, కాగా బ్యాంకు అధికారులు తమ వద్ద నుండి రూ. 1000 లావాదేవీకి రూ.15 నగదు వసూల్ చేస్తున్నారని ఓ వ్యాపారి వెల్లడించారు. దాంతో రేషన్ దుకాణంలో, మినీ వాటర్ ఏటీఎం దుకాణాల్లో మాత్రమే నగదు రహిత సేవలు అమలవుతున్నాయి. నగదు రహిత సేవలు ఆ గ్రామంలో నిర్వహించే ఆర్థిక లావాదేవీలకు మాత్రమే పరిమితమయ్యాయి. నగదు లభ్యత పెరిగిన తరువాత నగదురహిత లావాదేవీలు సగానికి తగ్గాయి. ఈ గ్రామంలో ధాన్యం అమ్మగా వచ్చిన నగదు, పొదుపు సంఘాల వారికి బ్యాంకులో నగదు జమ అవుతుంది. వ్యవసాయ కూలీలకు, వ్యవసాయ పనులకు మాత్రం నగదు రూపంలో జరుగుతుంది.