రాంచి, అక్టోబర్ 08 : ఝార్ఖండ్లోని అటవీశాఖ అధికారులు ఓ ఏనుగుకు ఘనంగా పుట్టిన రోజు వేడుకలు జరిపారు. జంషెడ్పూర్లోని పాఠశాల విద్యార్థుల సమక్షంలో భారీ కేక్ను కట్ చేసిన అధికారులు రజనీ అనే ఏనుగుకు జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఎనిమిదేళ్ల క్రితం స్వర్ణరేఖా నదిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న రజనీని చూసిన స్థానికులు సమాచారం అందించడంతో, ఘటనాస్థలికి చేరుకున్న అటవీశాఖ అధికారులు ఏనుగును రక్షించారు. నాటి నుంచి దానికి ఏటా జన్మదిన వేడుకలు జరుపుతున్నారు. జంతు సంరక్షణపై అందరికీ అవగాహన కల్పించేందుకే ఇలా చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.