పర్యటనలో భాగంగా సొంత ఊరిలో ప్రధాని మోదీ...

SMTV Desk 2017-10-08 13:41:09  Prime Minister Narendra Modi is a two-day tour, Vadanagar in Gujarath

గుజరాత్‌, అక్టోబర్ 08: భారత ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటనలో భాగంగా గుజరాత్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. మోదీ స్వస్థలమైన వడనగర్‌ ను నేడు సందర్శించారు. తాను చదువుకున్న పాఠశాలకు వెళ్లి భూమికి నమస్కరించారు. స్థానిక హట్కేశ్వర్‌ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టక తొలిసారి సొంత పట్టణానికి వస్తున్న ప్రధాని రోడ్ షో నిర్వహించారు. దారి పొడవున భారీగా నిలుచున్న ప్రజలు మోదీ..మోదీ... అంటూ నినదిస్తూ ఆయనకు స్వాగతం పలికారు. రోడ్డుకు ఇరు వైపులా నిలుచొని సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రధాని కి స్వాగతించారు. ప్రజలకు అభివాదం చేస్తూ మోదీ ముందుకు సాగారు. మొదటి రోజు ద్వారక ఆలయంలో పూజలతో గుజరాత్ పర్యటనను ప్రారంభించిన మోదీ అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. మోదీ తండ్రి వడనగర్‌ రైల్వే స్టేషన్‌లోనే ఓ టీ కొట్టును నడిపేవారు. ఈ సందర్భంగా రైల్వే స్టేషన్‌ వద్ద ఉన్న ఓ చిన్న టీ కొట్టు ఏర్పాటుచేసి బంతి పూలతో ప్రత్యేకంగా అలంకరించారు. రైల్వే స్టేషన్‌ ప్లాట్‌ ఫాం వద్ద మోదీకి సంబంధించిన చిన్న నాటి ఫొటోలతో ఓ ప్రదర్శనను ఏర్పాటు చేశారు. రైల్వే స్టేషన్‌ బయట మోదీ తలపెట్టిన ‘చాయ్‌ పే చర్చా’ క్యాంపెయిన్‌ పేరిట కుర్చీలు ఏర్పాటు చేసి పూలతో అందంగా అలంకరించారు. త్వరలో జరగనున్న గుజరాత్ ఎన్నికల్లో మరోసారి భాజపాను అధికారంలోకి తీసుకొచ్చే లక్ష్యంతో పలు మార్లు స్వరాష్ట్రం గుజరాత్ కు వెళుతున్న మోదీని ప్రజలు అద్భుతంగా ఆధారిస్తున్నారు.