రాంచీ, అక్టోబర్ 7 : ఆసీస్ అంటే రెచ్చిపోయే కోహ్లి.. చాలా రికార్డ్స్ ఆసీస్ మీదనే సాధించాడు అనడంలో అతిశయోక్తి లేదు. ఈ పరుగుల వీరుడు T-20 క్రికెట్లో వ్యక్తిగత అత్యధిక స్కోరు 90 కూడా ఆసీస్పైనే సాధించాడు. కోహ్లీని ఎలా ఔట్ చేయాలి అనే అంశంపై రాత్రంతా కూర్చొని చర్చించుకున్నామని ఆసీస్ క్రికెటర్ టిమ్పైన్ తెలిపాడు. తాజాగా ఆయన మాట్లాడుతూ.. "కోహ్లీ మంచి ఆటగాడు. ఈ రోజు మ్యాచ్ లో అతని వికెట్ మాకెంతో కీలకం. కోహ్లీని ఎలా పెవిలియన్కు పంపాలో ఆటగాళ్లందరం రాత్రంతా మేల్కొని చర్చించాం. అందుకు సంబంధించిన వివరాలు నేను ఇప్పుడే చెప్పను. ఎన్నో ప్లాన్స్ సిద్ధం చేసుకున్నాం. ఇక మ్యాచ్ లో అవి ఎలా అమలవుతాయో చూడాలి. అతన్ని వీలైనంత త్వరగా పెవిలియన్కు పంపించగలిగితే చాలు. కోహ్లీనే కాదు భారత జట్టంతా ప్రస్తుతం చాలా మంచి క్రికెట్ ఆడుతోంది. ఆటగాళ్లందరూ ఆత్మవిశ్వాసంతోనే ఎంతో మెరుగ్గా రాణించగులుగుతున్నారు. 1-4తో వన్డే సిరీస్ను కోల్పోయాం. టీ20 సిరీస్ను దక్కించుకోవాలని మేము ప్రయత్నిస్తున్నాం. మ్యాక్స్వెల్, ఫించ్, వార్నర్తో మా బ్యాటింగ్ లైనప్ బలంగానే ఉంది. విజయం ఎవరిని వరిస్తుందో చూద్దాం" అని పైన్ అన్నాడు.