హైదరాబాద్, అక్టోబర్ 06 : సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల ఫలితాలు 2019 కి సార్వత్రిక పోరుకు అద్దం పడుతున్నాయని తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన ప్రగతి భవన్లో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, తలసాని శ్రీనివాస్యాదవ్, జగదీష్రెడ్డి, ఎంపీలు కవిత, వినోద్, ఖనిజాభివృద్ధి సంస్థ ఛైర్మన్ శేరి సుభాష్రెడ్డి, మిషన్ భగీరథ ఉపాధ్యక్షుడు వేముల ప్రశాంత్రెడ్డి, రసమయి బాలకిషన్, పుట్టా మధు, సాట్స్ ఛైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి తదితరులతో కలిసి విలేకరులతో మాట్లాడుతూ... తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రతీ ఎన్నికల్లో ప్రజలు తెరాసకే పట్టం కట్టారని, సానుభూతి పవనాలకు వ్యతిరేకంగా భారీ మెజారిటీతో గెలిపించారన్నారు. విపక్షాలు అన్ని ఏకమైన వారిని కార్మికులందరూ తిరస్కరించారని పేర్కొన్నారు. కాంగ్రెస్ సహా ఐకాస అధ్యక్షుడు కోదండ రామ్ పై కేసీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ప్రాజెక్టులను కేసులతో అడ్డుకోవాలని చూసినా, ఎన్ని అవరోధాలు కల్పించినా రాష్ట్రాన్ని ధృఢ సంకల్పంతో అభివృద్ధి పదంలో నడిపిస్తామన్నారు.