న్యూఢిల్లీ, అక్టోబర్ 06 : ఉరి తీయడం ద్వారా మరణశిక్ష విధానాన్ని సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యం పై అభిప్రాయం చెప్పాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఉరి ద్వారా మరణ శిక్ష అమలు చేయడం రాజ్యాంగ విరుద్ధం అంటూ న్యాయవాది రిషి మల్హోత్రా సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దోషిగా తేలి మరణ శిక్ష ఖరారైన వ్యక్తి సైతం గౌరవ ప్రదంగా తక్కువ బాధతో చనిపోయ్యే హక్కును కల్పించే నిబంధన, రాజ్యాంగంలోని జీవించే హక్కును నిర్దేశించే 21వ అధికరణలో ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం మరణశిక్ష అమలు చేస్తున్న తీరుకు వ్యతిరేకంగా న్యాయస్థానం 187వ నివేదికలో చేసిన వ్యాఖ్యలు సహా వేర్వేరు సందర్భాల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల్ని న్యాయవాది రిషి ప్రస్తావించారు. ఈ వాదనలని పరిగణలో తీసుకున్న న్యాయస్థానం శాస్త్రీయ రంగంలో వస్తున్న పురోగతిని దృష్టిలో ఉంచుకుని మరో విధంగా మరణ శిక్ష అమలు చేసే విధానాన్ని శాసన వ్యవస్థ పరిశీలించాలని సూచించింది. ఈ వ్యాజ్యంపై అభిప్రాయం చెప్పేందుకు కేంద్రానికి మూడు వారాలు గడువు ఇచ్చింది.