బల్లి కారణంగా ప్రాణాలు విడిచిన వృద్ధుడు...

SMTV Desk 2017-10-06 17:28:34  hyderabad, america, Crime

హైదరాబాద్, అక్టోబర్ 6: పరదేశం మీద వ్యామోహంతో విదేశాలకు తరలివెలుతున్న ఈ రోజుల్లో, మన దేశంమీద ఉన్న మమకారంతో సొంతవూరు లోనే ఉన్న మూర్తి ప్రాణాలు పోగొట్టుకున్న తీరు హృదయ విదారకం. హైదరాబాద్ లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఉదంతం, పూర్తి వివరాల్లోకి వెళ్తే.... రాజమహేంద్రవరం కు చెందిన 70 ఏళ్ల మూర్తి ఒక ప్రభుత్వ ఉద్యోగిగా పని చేసి పదవి విరమణ పొందారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుమార్తెలిద్దరూ అమెరికాలో స్థిరపడి, ప్రతి నెల తల్లిదండ్రులకు డబ్బు పంపేవారు. మీరిద్దరూ అక్కడ ఒంటరిగా ఉండటం ఎందుకు.. అమెరికాకు వచ్చేయండని ఆరు నెలల క్రితం ఆయన కుమార్తెలు టిక్కెట్లు పంపారు. కాని సొంతవూరు విడిచిపెట్టి వెళ్ళడం ఇష్టంలేని మూర్తి భార్యను అక్కడికి పంపించాడు. హైదరాబాద్ లో ఆగస్టు 18వ తేదిన బంధువుల ఇంట్లో శుభకార్యానికి హాజరైన మూర్తి అనంతరం ఎల్బీనగర్ లోని తన ఫ్లాటుకి వెళ్ళారు. ఆ తరువాత ఎన్నిసార్లు ఫోన్ చేసినా దాదాపు నెల రోజుల వరకు అయన నుండి ఎటువంటి స్పందన లేకపోవడంతో, కంగారు పడిన ఆయన కుటుంబ సభ్యులు హుటాహుటిన అమెరికా నుంచి ఇండియాకు వచ్చారు. అనంతరం వారీ ఫ్లాటు వద్దకు చేరుకున్న కుటుంబ సభ్యులు తలుపులు తెరవడానికి ఎంత ప్రయత్నించిన తెరుచుకోక పోవడంతో, వారు ఆ తలుపులను పగల గొట్టడంతో ఎదురుగా పడి ఉన్న ఆయన మృతదేహాన్ని చూసి నివ్వెర పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం... ఆయన స్నానం చేసి వస్తూ ఒక బల్లిపై కాలు వేసి జారి పడ్డారని, తలకు తీవ్ర౦గా దెబ్బతగలడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు వెల్లడించారు. మృతదేహం దగ్గర చనిపోయిన బల్లి...కాలు జారిన గుర్తులు ఉన్నాయని స్పష్టం చేశారు.