న్యూఢిల్లీ, అక్టోబర్ 6 : ఆసీస్ తో ముగిసిన వన్డే సిరీస్లో తన అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్న టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్య.. సూపర్ స్టార్ గా ఎదుగుతాడని మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి మ్యాచ్ లో 10 ఓవర్లు చేసే పాండ్య.. బ్యాటింగ్, బౌలింగ్ లోనూ తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తాడు. ఈ సందర్భంగా పాండ్య గురించి సెహ్వాగ్ స్పందిస్తూ.. "పాండ్య మంచి ఆట తీరును కనబరుస్తున్నాడు. అతను భవిష్యత్తులోనూ ఇదే శైలిలో ఆడితే టీమిండియా సూపర్ స్టార్ అవుతాడని భావిస్తున్నా.. ఇప్పుడిప్పుడే క్రికెట్ లో ఎదుగుతున్న ఆయనను కపిల్ దేవ్, యువరాజ్ సింగ్ తో పోల్చడం సరికాదు. ఆ ఇద్దరిలా సుదీర్ఘకాలం పాటు తన ఆటను కొనసాగించి విజయం సాధిస్తే అప్పుడు పోల్చండి" అంటూ తెలిపారు.