ముంబై, అక్టోబర్ 5 : భారత్ లో కొన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల వెబ్ సైట్ లు హ్యాకింగ్ కు గురైనట్లు ఇంటిలిజెన్స్ బ్యూరో వెల్లడించింది. అంతేకాకుండా హ్యాకింగ్ కు గురైన సంస్థల పూర్తి డేటాను హ్యాకర్లు అమ్మకానికి పెట్టినట్లు పేర్కొంది. ఈ హ్యాకింగ్ కి గురైన సైట్లలో భారతీయ రిజర్వ్ బ్యాంకు, డీఆర్డీఓ, ఈపీఎఫ్ఓ వంటి ప్రముఖ సంస్థలు ఉన్నాయని సైబర్ ఇంటెలిజెన్స్ తెలిపింది. అయితే ఈ దాడి భారతదేశ జాతీయ ఇంటర్నెట్ రిజిస్ట్రీ నుంచే జరిగినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ జాతీయ ఇంటర్నెట్ రిజిస్ట్రీ విభాగం ఇంటర్నెట్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా పరిధిలో పనిచేస్తుంది. కాగా పూర్తి డేటాను కొనడానికి తాము సిద్దంగా ఉన్నామని నటిస్తూ.. జాతీయ ఇంటర్నెట్ రిజిస్ట్రీ హ్యాకర్లతో సంప్రదింపులు కూడా జరిపారని.. కాని వారు మాత్రం ఎలాంటి సమాచారం బయటపెట్టలేదని ఆ సెక్యూరిటీ సంస్థ సెక్రైట్ సైబర్ ఇంటెలిజెన్స్ వివరించింది. దీనిని బట్టి చూస్తే దేశంలో చాలానే ఐపీ అడ్రస్ లు హ్యాకింగ్ కి గురై ఉండవచ్చని ఇంటిలిజెన్స్ బ్యూరో వెల్లడించింది.