బిలాస్పూర్, (హిమాచల్) అక్టోబర్ 04 : హిమాచల్ ప్రదేశ్ లో ఎయిమ్స్(ఆల్ ఇండియా ఇన్సిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్), ఐఐటీలకు మంగళవారం భారత ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. తొలుత చండీగఢ్ నుంచి హిమాచల్ కు చేరుకున్న ప్రధాని బిలాస్పూర్ లో రూ.1300 కోట్ల ఖర్చుతో నిర్మించనున్న ఎయిమ్స్ కు శంకుస్థాపన చేశారు. 3000 మంది ఒకే చోట పని చేసే అవకాశం ఉన్న ఐఐటీ భవిష్యత్తు అవకాశాలకు పునాది వేస్తుందని మోదీ ఈ సందర్భంగా అన్నారు. ఎయిమ్స్ వల్ల హిమాచల్ ప్రజలకు మెరుగైన చికిత్స అందడంతో పాటు పర్యాటక అభివృద్ధికి సైతం ఉపకరిస్తుందన్నారు. రాష్ట్రంలో పర్యాటకుల సంఖ్య బాగా పెరిగితే ఉపాధి అవకాశాలు మరింతగా విస్తరిస్తాయని తెలిపారు. హిమాచల్ ప్రదేశ్ లో వివిధ ప్రాజెక్టులకు రూ.15 వేల కోట్లు తమ కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేస్తుందని మోదీ వివరించారు.