విజయవాడ, అక్టోబర్ 04 : తెలుగు భాష అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రశంసించారు. మంగళవారం జాతీయ జల రవాణా మార్గానికి శంకుస్థాపన చేసిన తరువాత విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... “ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో తెలుగుని ఒక భాషగా నేర్పించాలి. దీనిలో తప్పనిసరిగా ఉత్తీర్ణులవ్వాలన్న నిబంధన పెట్టాలి. బ్యాంకులు సహా అన్ని చోట్లా దరఖాస్తులన్నీ తెలుగులోనే ఉండాలి. ప్రతి దుకాణం, సినిమాహాల్లు, షాపింగ్ మాల్స్, హోటల్ల నామ ఫలకాలు తప్పనిసరిగా తెలుగులోనే ఉండాలి. తెలుగులో రాసిన తర్వాత, ఇక ఏ భాషలో రాసుకున్నా ఫర్వాలేదంటూ, తెలుగు భాష అభివృద్ధికి మరిన్ని చర్యలు తీసుకోవాలి” అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కోరారు. ప్రభుత్వ ఉద్యోగం దక్కాలంటే తెలుగు భాష తప్పనిసరి అని నిబంధనను పెట్టాలని వెంకయ్య అభిప్రాయపడ్డారు. విజయవాడ పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ అస్సాం నుంచి వచ్చిన చక్కగా తెలుగులో మాట్లాడుతున్నారని కితాబు ఇచ్చారు.