న్యూఢిల్లీ, అక్టోబర్ 4 : ఒక చిన్న సహాయం చేయండి లక్ష రూపాయలు బహుమతిగా అందుకోండి అంటూ భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ప్రకటించారు. వివరాలలోకి వెళితే... గతంలో పొరపాటున ఇండియా నుండి పాకిస్తాన్ వెళ్లి అక్కడే దాదాపు 13 సంవత్సరాలు ఆశ్రయం పొందిన మూగ, బదిర యువతి గీత.. భారత ప్రభుత్వం చొరవతో మళ్ళీ ఇండియా తిరిగివచ్చింది. ఆమె బీహార్ కు లేదా జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన యువతి కావొచ్చని భావిస్తున్నారు. అయితే గీత తల్లిదండ్రులను కనిపెట్టే బాధ్యతను సుష్మాజీ ప్రజలపైనే వేశారు. ఆమె తల్లిదండ్రులెవరో గుర్తించిన వారికి లక్ష రూపాయలు బహుమతిగా ఇస్తామని తెలిపారు. ఆమె తలిదండ్రులను గుర్తించేందుకు అందరు సాయపడాలని అభ్యర్థించారు. కాగా అతి చిన్న వయస్సులో తప్పిపోయి పాక్ చేరుకున్న గీతను తిరిగి భారత్ కు రప్పించేందుకు సుష్మాజీ ప్రత్యేక శ్రద్ధ చూపారు. రెండేళ్ల క్రితం గీత భారత్ కు తిరిగి రాగా, అప్పటినుండి ఇప్పటి వరకు ఆమె తల్లిదండ్రులను కనిపెట్టడంలో మాత్రం ప్రభుత్వం విఫలమైంది. దీంతో ఆ బాధ్యతను ప్రజలపైన వేసినట్లు ఆమె తెలిపారు.