హైదరాబాద్, అక్టోబర్ 3 : రాజధాని నగరంలో కురిసిన భారీ వర్షాల కారణంగా అధికార యంత్రాంగమంతా అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆదేశించారు. ఈ నేపథ్యంలో నగరంలోని పరిస్థితిపై సోమవారం రాత్రి సీఎం అధికారులతో మాట్లాడారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ కమీషనర్, నగర్ పోలీస్ కమీషనర్లతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. నిన్న అతి భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని చెప్పారు. రాత్రంతా అధికార యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడ సమస్య ఉన్నా వెంటనే స్పందించాలని కోరారు. రానున్న రెండు రోజుల్లో కూడా అతి భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న తరుణంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు రావద్దని ముఖ్యమంత్రి సూచించారు.