స్టాక్హోం, అక్టోబర్ 3 : భౌతికశాస్త్రంలో చేసిన విశేష పరిశోధనలకు గాను ఈరోజు నోబెల్ కమిటీ విజేతలను ప్రకటించింది. ఈ ప్రతిష్టాత్మకమైన నోబెల్ పురస్కారానికి ముగ్గురు అమెరికా శాస్త్రవేత్తలు ఎంపికయ్యారు. భౌతికశాస్త్రవేత్తలు రైనర్ వేస్, బ్యారీ బ్యారిష్, కిప్ థోర్న్ లు ఈ అవార్డును దక్కించుకున్నారు. వీరికి గురుత్వాకర్షణ తరంగాలను గుర్తించినందుకు ఈ అరుదైన గౌరవం వరించింది. ఫిజిక్స్ విభాగంలో నోబెల్ బహుమతి అందుకున్న 204 మంది జాబితాలో ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు చోటు దక్కించుకోవడం విశేషం. ఈ అవార్డులను స్వీడన్ రాయల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రకటించింది. కాగా శాస్త్రవేత్తలు రైనర్ వేస్-మాసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఆచార్యుడు కాగా.. బ్యారీ బ్యారిష్, కిప్ థోర్న్ మాత్రం కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో అధ్యాపకులుగా పని చేస్తున్నారు.