హైదరాబాద్, అక్టోబర్ 3 : కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన గవర్నర్ నియామకాల్లో తన పేరు లేకపోవడంపై తెలంగాణకు చెందిన టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఆయన స్పందిస్తూ... "గవర్నర్ పదవి రాకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యాను. గత మూడేళ్ల నుండి గవర్నర్ పదవి కోసం చూస్తున్నాం. కాని ఆ పదవి దక్కకపోవడంతో మా కుటుంబ సభ్యులు కంటతడి పెట్టుకున్నారు. ఆ బాధతోనే ఈ దసరా పండగను కూడా జరుపుకోలేదు. భవిష్యత్తులో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలతో పొత్తు పెట్టుకోవచ్చు కానీ కాంగ్రెస్ తో మాత్రం ఎలాంటి పొత్తు పెట్టుకోకూడదు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై నమ్మకం ఉంది. కనీసం రాజ్యసభ పదవి అయిన వస్తుందని ఆశిస్తున్నా" అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.