జనగాం, సెప్టెంబర్ 26 : జనగామ జిల్లా కలెక్టర్ శ్రీ దేవసేన సంచలన వ్యాఖ్యలు చేశారు. జనగామలోని మినీ ట్యాంక్ బండ్ నిర్మాణంలో చాలా అక్రమాలు జరిగాయంటూ ఆమె వెల్లడించారు. అర ఎకరం శికం భూమిని ఎమ్యెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తన సొంత పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకోగా తాను ఆ రిజిస్ట్రేషన్ ను రద్దు చేసినట్లు దేవసేన స్పష్టం చేశారు. జనగామలో మినీ ట్యాంక్ బండ్ నిర్మాణ పనులను ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, స్థానిక ఎమ్యెల్యే ముత్తిరెడ్డి లు సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆ ప్రాజెక్ట్ కు సంబంధించి అన్ని దస్త్రాలను పరిశీలించినప్పుడు అన్ని నియమ నిబంధనలను అతిక్రమించి ఉన్నట్లు తేలిందన్నారు. ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు కలెక్టర్ వెల్లడించారు. ఆ ప్రాంతంలో అభివృద్ధి కోసం 30 లక్షలు ఖర్చు చేసినట్లు చెబుతున్న ఎమ్యెల్యే, అవి ఎందుకు ఖర్చు చేశారో చెప్పకుండా.. ప్రభుత్వం నుండి మిగిలిన ఫండ్స్ అన్ని రాబట్టమని అడుగుతున్నారని తెలిపారు. ఈ క్రమంలో దేవసేన ఆ వాకర్స్ అసోసియేషన్ వారికి నోటీసులను జారీ చేశారు. ఆ 30 లక్షలను ఎందుకు, ఎక్కడ ఖర్చు చేశారో ఒక లిస్టును తయారుచేసి ఇవ్వవలసి౦దిగా కోరారు. దానిని బట్టి మిగతా పనులను చేపట్టనున్నట్లు వెల్లడించారు.