సెల్ఫీ వ్యామోహం... తోటి విద్యార్ధి మృతి

SMTV Desk 2017-09-26 15:11:00  jayanagara National College in Bangaluru, student, selfie

కర్ణాటక, సెప్టెంబర్ 26 : కర్ణాటకలోని రామనగర జిల్లా రామగొండ్లు గ్రామంలో ఓ విషాదకర ఘటన ఆదివారం చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే... బెంగళూరులోని జయనగర నేషనల్‌ కళాశాలకు చెందిన ఇంటర్‌ మొదటి సంవత్సరం విద్యార్ధులు దసరా సెలవులు కావడంతో కళాశాల నుంచి 25 మంది ఎన్‌.సి.సి. విభాగం తరఫున స్వచ్ఛసేవకు రామగొండ్లు వెళ్లారు. అనంతరం ఈత కొట్టేందుకు అక్కడి ఓ ఆలయ పుష్కరిణిలోకి వారిలో కొందరు దిగారు. ఈత సరిగారాని విశ్వాస్‌ కూడా కోనేరులోకి దిగాడు. ఈ క్రమంలో విద్యార్థులంతా స్వీయచిత్రాలు తీసుకుంటుండగా.. లోతుకు వెళ్లిపోయిన విశ్వాస్‌ నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. ఆ దృశ్యం స్వీయచిత్రాల్లో కనిపించడం గమనార్హం. నిర్వాహకుల నిర్లక్ష్యమే దీనికి కారణమని విశ్వాస్‌ తల్లిదండ్రులు ఆరోపించారు. విశ్వాస్‌ తండ్రి గోవిందప్ప ఆటో డ్రైవర్‌. సోమవారం కళాశాల ఎదుట వారంతా ధర్నా నిర్వహించారు. ఈ సంఘటనకు బాధ్యుడిని చేస్తూ, కళాశాల నిర్వాహకులు ఎన్‌సీసీ అధికారి గిరిష్‌ను సస్పెండ్‌ చేశారు.