అమరావతి, సెప్టెంబర్ 26 : పోలవరం ప్రాజెక్టుకు రూ.2,800 కోట్ల పెండింగ్ నిధులు ఇచ్చేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. నాబార్డు ద్వారా త్వరలో నిధుల విడుదలకు సానుకూలంగా స్పందించింది. ఢిల్లీలో కేంద్ర జల వనరుల మంత్రి నితిన్ గడ్కరీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశంలో ఈ మేరకు హామీ లభించింది. రాష్ట్రంలోని జాతీయ రహదారుల అభివృద్ధి, పోలవరం ప్రాజెక్టు, నదుల అనుసంధానం, జల రవాణాపై గడ్కరీతో చంద్రబాబు గంటకుపైగా చర్చించారు. అక్టోబర్ 3న పోలవరం ప్రాజెక్టు పరిశీలనకు రావాలని చంద్రబాబు ఆహ్వానించగా గడ్కరీ దానికి అంగీకరించారు. రాష్ట్రంలోని ప్రముఖ క్షేత్రాలను, మారుమూల ప్రాంతాలను పొరుగు రాష్ట్రాలతో అనుసంధానించే రహదారి ప్రణాళికను బాబు వివరించారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు నేడు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీతో కూడా సమావేశమయ్యారు. కాగా, భారత ప్రధాని మోదీతో సైతం సమావేశం కావాల్సి ఉందని అధికార వర్గాలు తెలిపాయి.