తిరుమల, సెప్టెంబర్ 26: తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు సోమవారం రాత్రి తిరుమలేశుడు ముత్యపు పందిరి వాహనంపై రుక్మిణీ, సత్యభామ సమేత వేణు గోపాలకృష్ణుడు అవతారంలో భక్తులకు సాక్షాత్కరించారు. ముత్యాల పందిరిలో ముద్దులొలికే దేవేరులతో కలిసి, ద్వాపరయుగం నాటి శ్రీ కృష్ణలీలలు గుర్తు చేస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాల్లో నాలుగవ రోజులో భాగంగా నేటి ఉదయం స్వామివారు కల్పవృక్షంపై విహరిస్తూ భక్తులకు అభయమిచ్చారు. రాత్రి సర్వభూపాల వాహనంపై తిరువిధుల్లో దర్శనమివ్వనున్నారు శ్రీ వేంకటేశుడు. కన్నులపండుగగా సాగుతున్న ఈ వైభవాన్ని చూసేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.