న్యూఢిల్లీ, సెప్టెంబర్ 26 : ప్రధాని నరేంద్ర మోదీ నిరుపేద, దిగువ, మధ్య తరగతి కుటుంబాలను దృష్టిలో ఉంచుకొని కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. వచ్చే ఏడాదికి వరకు దేశంలో ఎక్కడ, ఏ ఇంట్లో కూడా కిరోసిన్ లాంతరు ఉండకూడదన్న ముఖ్య ఉద్దేశంతో... దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న నిరుపేదలకు విద్యుత్తు కనెక్షన్ను ఉచితంగా ఇవ్వనున్నారు. అలాగే దారిద్ర్య రేఖకు ఎగువన ఉన్న వారికి మాత్రం రూ.500 కే కనెక్షన్ను ఇవ్వడానికి మోదీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఈ కనెక్షన్ బిల్లును.. విద్యుత్ బిల్లుతో పాటే పది సులభ వాయిదాలలో చెల్లించుకునే సౌలభ్యాన్ని కల్పించనుంది. ఈ కార్యక్రమాన్ని "సౌభాగ్య" అనే పేరిట ఒక కొత్త పథకానికి నాంది పలికారు. ఈ పథకం కింద నాలుగు కోట్లకు పైగా కుటుంబాలకు విద్యుత్ కనెక్షన్లను ఇవ్వనున్నారు. విద్యుత్ పంపిణీ కంపెనీలు, గ్రామ పంచాయతీ, అన్ని ప్రభుత్వ సంస్థల ప్రతినిధులు ఈ దరఖాస్తులను అందజేసి, వాటితో పాటు బిల్లుల పంపిణీ.. వసూల్ల పనులను చేపట్టనున్నారు. కాగా ఈ పథకానికి కావలసిన ఖర్చును 60% కేంద్రం, 10% రాష్ట్ర౦, మిగతా 10% రుణాల ద్వారా తీసుకుంటామని మోదీ వెల్లడించారు.