న్యూ ఢిల్లీ సెప్టెంబర్ 26 : స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు అవుతున్నా.. దేశంలో కరెంట్ సదుపాయం లేని కుటుంబాలు ఎన్నో ఉన్నాయని, వారందరికీ విద్యుత్ కనెక్షన్లు అందించే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సౌభాగ్య పథకానికి శ్రీకారం చుట్టారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 4 కోట్లకు పైగా కుటుంబాలకు ఉచితంగా విద్యుత్ కనెక్షన్లు అందించేందుకు ఉద్దేశించిన ‘సౌభాగ్య’ పథకాన్ని ( ప్రధాన మంత్రి సహజ్ బిజిలీ హర్ ఘర్ యోజన ) ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ప్రారంభించారు. ఈ పథకంలో భాగంగా రూ. 16,320 కోట్లతో డిసెంబర్ 2018 నాటికి దేశంలో విద్యుత్ సదుపాయం లేని కుటుంబాలకు కనెక్షన్లను అందచేస్తామన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం పేదల ఉన్నతికి కట్టుబడి ఉందని.. పేదల జీవితాల్లో భారీ మార్పు తీసుకొచ్చేందుకు రూ. 16 వేల కోట్లతో ఈ పథకాన్ని ప్రారంభించామని, జన్ ధన్ యోజన నుంచి ముద్రా యోజన వరకూ ఎన్నో పథకాలు ప్రారంభించిందని ఆయన గుర్తు చేశారు. గతంలో విద్యుత్ కోతలు, విద్యుత్పత్తి కేంద్రాలకు బొగ్గు కొరతను వార్తల్లో బ్రేకింగ్ న్యూస్గా చెప్పేవారిని, ఇప్పుడు పరిస్థితి మారిందని.. దేశం విద్యుత్ కొరత నుంచి విద్యుత్ మిగులు వైపు అడుగులు వేస్తోందని పేర్కొన్నారు. వచ్చే మార్చి 2019 నాటికి దేశంలోని అన్ని గ్రామాల విద్యుదీకరణకు, 24 గంటల విద్యుత్ సరఫరా అందించేందుకు కృషి చేస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.