గుజరాత్, సెప్టెంబర్ 25 : త్వరలో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపధ్యంలో, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ.. నేటి నుంచి మూడు రోజుల పాటు గుజరాత్ లో పర్యటించనున్నారు. ఈ ఉదయం ఆయన ద్వారకాదీశ్ కృష్ణ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి అనంతరం అక్కడినుండి బయలుదేరి స్థానికులతో మమేకమవుతూ యాత్రను కొనసాగించారు. అందరి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఇలా ఉండగా కీలకమైన సౌరాష్ట్ర ప్రాంతంలో రాహుల్ ఓపెన్ టాప్ జీపులో వెళ్లాలని భావించగా.. భద్రతా కారణాల దృష్ట్యా పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో జాతీయ రహదారిపై ప్రత్యేక లగ్జరీ బస్సులో, జనావాస ప్రాంతాల్లో ఎద్దుల బండిపై యాత్రను కొనసాగించాలని రాహుల్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకు పోలీసులు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. కాగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడి హోదాలో రాహుల్ చేస్తున్న ఈ పర్యటనకు ప్రజలనుండి మంచి స్పందన లభిస్తోంది.