దుబాయ్, సెప్టెంబర్ 23 : విమానయాన సంస్థలు ఎన్ని ఆఫర్లను ప్రవేశపెట్టిన దిగువ, మధ్య తరగతి కుటుంబాలను మాత్రం ఆకర్షించలేకపోతున్నాయి. దీంతో వారిని ఆకర్షించడమే లక్ష్యంగా దుబాయి విమానయాన సంస్థ సరికొత్త పద్ధతికి శ్రీకారం చుట్టింది. ఇతిహాస్ ఎయిర్లైన్స్ "ఫ్లై నౌ అండ్ పే లేటర్" పేరుతో విమాన టికెట్ పై ఈఎంఐ సదుపాయాన్ని(వాయిదాల పద్దతిలో చెల్లింపు) కల్పిస్తోంది. ఇందులో భాగంగా ప్రయాణికులు టికెట్ బుక్ చేసుకునేటప్పుడు "పే బై ఇన్స్టాల్మెంట్" అనే ఆప్షన్ ను ఎంచుకొని క్రెడిట్ లేదా డెబిట్ కార్డు వివరాలను ఇవ్వాల్సి ఉంటుందని ఎయిర్లైన్ వైస్ ప్రెసిడెంట్ జస్టిన్ వార్బీ వెల్లడించారు. దీని ద్వారా టికెట్ డబ్బును 3 నుంచి 60 నెలల వాయిదాల్లో చెల్లించుకునే సదుపాయాన్ని కల్పించామని, ముఖ్యంగా ఈ ఆఫర్ ను మధ్యతరగతి కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని ప్రవేశపెట్టినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం ఈ స్కీం యూఏఈ, సౌదీ అరేబియా, ఈజిప్టు ప్రజలకు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు వివరించారు.