న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23 : దేశం కాని దేశంలో శరణార్థులుగా మారి బిక్కుబిక్కుమంటూ బతుకుతున్న సిరియా శరణార్థులను యునిసెఫ్ రాయబారి బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా పలకరించారు. మూడురోజుల పర్యటన నిమిత్తం యునిసెఫ్ తరపున జోర్డాన్ సిరియా సరిహద్దు వద్ద ఉన్న శరణార్థుల శిబిరాన్ని ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఆ పిల్లలతో సమయం గడిపిన ప్రియాంక, వారి ఇష్టాలు, అభిరుచులను అడిగి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో కష్టపడే తత్వం సవాళ్లను, ఎదిరించే తెగువను పెంచుకుంటేనే విజయం అదే వరిస్తుందని ఆమె అన్నారు. ప్రపంచంలో ఎక్కడున్నా విజయం సాధించాలంటే వారి అభిరుచులు, అభిప్రాయాలపై ధృఢమైన నిర్ణయాన్ని ఏర్పరుచుకుంటే గెలుపు సాధ్యమవుతుందని అంటూ వారిలో ధైర్యాన్ని నింపారు. కాగా, బాలీవుడ్, హాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకున్న ప్రియాంక చోప్రా తమను కలవటం ఆనందంగా ఉందని శరణార్థుల పిల్లలు సంతోషం వ్యక్తం చేశారు. తాము ప్రదర్శించిన చిత్రలేఖనం, ఆటల్లో ప్రతిభను గుర్తించి ప్రశంసించడంతో తమలోని ధైర్యం మరింత పెరిగిందన్నారు. పిల్లలంతా మాతృ దేశానికి దూరమై మానసిన ఆందోళన ఉన్నా, అందరిలోనూ అసమాన ప్రతిభ దాగుందని ప్రియాంకా చోప్రా ప్రశంసించారు. ప్రభుత్వాలు శరణార్థులకు అండగా ఉండాలని వీలునంతవరకు మానవ దృక్పథంతో మనం సైతం వారికి చేయూతనివ్వాలని ఆమె ప్రపంచ దేశాలను కోరారు.