హైదరాబాద్, సెప్టెంబర్ 23: తెలంగాణ సర్కారు మరొక ప్రాజెక్టు రూపకల్పనకు ప్రణాళికను సిద్దం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు లక్ష కోట్ల భారీ బడ్జెట్ తో మిషన్ హైదరాబాద్ పేరుతో రూపు దిద్దబోతున్నారు. విశ్వ నగరంగా హోదా పొందిన భాగ్యనగరానికి చాలా సమస్యలు వెంటాడుతున్నాయి. ఈ సమస్యల పరిష్కారానికై మిషన్ హైదరాబాద్ లో భాగంగా శిథిలావస్థలో ఉన్న భవనాలను, తొలగించి అదే స్థానంలో నూతన భవనాలను నిర్మించడం, అత్యాధునిక ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థ, అంతర్జాతీయ స్థాయిలో రోడ్లు, ఫుట్ పాత్ లు, కేబుల్ డక్ట్ లు ఏర్పరిచి జంక్షన్ ల వద్ద అభివృద్ధి చేయనున్నారు. నగరంలో ప్రధానమైన రవాణా వ్యవస్థను మెరుగుపరచడానికి, మరికొన్ని ప్రాంతాలకు సౌకర్యాలను కల్పించేలా మెట్రో రెండో దశను ఆవిష్కరించనున్నారు. నగరమంతటా తెలంగాణ సంస్కృతి కనిపించేలా కల్చరల్ సెంటర్లు, కొత్త డ్రైనేజీల నిర్మాణం, ఆధునిక బస్ బేలు, పార్కులను, పార్కింగ్ లకు కావలసిన సదుపాయాలను, పబ్లిక్ టాయిలెట్స్, డంపింగ్ యార్డులు, స్మశాన వాటికలు, మార్కెట్లను సైతం సుందరంగా తీర్చిదిద్దనున్నారు. అంతేకాకుండా ప్రముఖ పర్యాటక ప్రాంతాల వద్ద విదేశీయులను ఆకర్షించే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. ఈ మిషన్ హైదరాబాద్ ప్రాజెక్టు పూర్తి కావడానికి దాదాపు 3 సంవత్సరాల సమయం పట్టనుందని అధికారిక వర్గాలు అంచనా వేస్తున్నారు.