జైపూర్, సెప్టెంబర్ 22: సమాజంలో తమకు తాము దేవుళ్ళుగా ప్రకటించుకుంటూ దైవాంశ సంభూతులుగా పేర్కొంటూ ఇటీవల కాలంలో కొంత మంది వ్యక్తులు బాబాలుగా చలామణి అవుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల డేరా బాబా ముసుగులో ఎంతోమంది మహిళలల పై అకృత్యాలకు పాల్పడి జైలుకి వెళ్ళిన ఘటన మరువకముందే మరో బాబాపై అత్యాచార కేసు నమోదైంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే... రాజస్థాన్లో పేరుగాంచిన 70ఏళ్ల కౌశలేంద్ర ప్రపన్నచార్య మహరాజ్ బాబా (ఫలహారి బాబా) తన ఆశ్రమంలో తనను లైంగిక వేధింపులకు గురిచేసినట్లు 21ఏళ్ల మహిళ.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా గత ఆగస్టు 7వ తేదీ రాత్రి సమయంలో బాబా తనను అతడి గదిలోకి పిలిచాడని, ఆ తర్వాత తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని తెలిపింది. ఒకవేళ ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించినట్లు బాధిత మహిళ ఈ ఫిర్యాదులో పేర్కొంది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు కొనసాగించగా బాధిత మహిళ ఇంటికి గతంలో కొన్నిసార్లు బాబా వెళ్లినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ప్రస్తుతం ఫలహారి బాబా అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతు౦డగా.. అతడు కోలుకున్నాక ఈ విచారణను కొనసాగించనున్నట్లు పోలీసులు వెల్లడించారు.