తమిళనాడు సెప్టెంబర్ 22: అమ్మ మరణంతో అన్నాడీఎంకే పార్టీలో కలకలం చెలరేగిన విషయం తెలిసిందే. అయితే రాబోయే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా అన్నాడీఎంకే, బీజేపీ వర్గాలు పావులు కదుపుతున్న నేపథ్యంలో వీరికి చెక్ పెట్టడానికి కమలహాసన్ రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నారనే వార్తలు తమిళ రాజకీయాల్లో మరింత ఉత్కంట ను రేకెత్తిస్తున్నాయి. తాజాగా ఆమ్ ఆద్మీ నేత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విలక్షణ నటుడు కమలహాసన్ తో భేటీ అయ్యారు. అయితే వారిద్దరి భేటీ వెనక ఎలాంటి రాజకీయ కోణం లేదని వారిరువురూ మీడియా ముందు చెప్పినా.. ఈ భేటీ వెనకాల బలమైన రాజకీయ కోణం ఉన్నట్టుగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కమల్ ను కేజ్రీవాల్ ఆప్ లోకి ఆహ్వానించడానికే పనికట్టుకొని మరీ ఢిల్లీ నుండి చెన్నై కి వచ్చారని తెలుస్తుంది. కాషాయం తన దారికాదని ఇటీవల కమల్ పరోక్ష సంకేతాలు పంపిన నేపథ్యంలో, ఇప్పటికే బీజేపీ తో వైరం పెంచుకున్న ఆప్ తో కమల్ కూడా చేతులు కలిపితే దక్షిణాదిలో కూడా తన పార్టీ ని విస్తరించవచ్చని కేజ్రీవాల్ వ్యూహ రచన చేసినట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగానే కమల్ తో భేటీ అయినట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి కమల్ ఆప్ పార్టీ తో చేతులు కలుపుతారా..? లేక సొంత పార్టీ పెట్టుకొని తమ ప్రాబల్యాన్ని చాటుకుంటారా..తెలియాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే..!