కర్ణాటక సెప్టెంబర్ 21: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ అల్లుడు ‘కాఫీ డే’ యజమాని వీజీ సిద్ధార్థకి ఆదాయపు పన్ను శాఖ షాకిచ్చింది. ముంబై, చెన్నై, బెంగళూరు నగరాల్లోని ఆయన నివాసాలు, కాఫీ తోటలు, కార్యాలయాల్లో ఏకకాలంలో దాడులు చేపట్టింది. 20 ప్రాంతాల్లో ఒకేసారి ఐటీ దాడులకు దిగడంతో నివ్వెర పోవడం ఆయన వంతైంది. బెంగళూరులో కేప్ చైన్ కేఫ్ కాఫీ డే ప్రధాన కార్యాలయం ఉంది. ఈ కార్యాలయంలో కూడా ఐటీ తనిఖీలు చేపడుతోంది. కాంగ్రెస్ సీనియర్ నేత అయిన ఎస్ఎం కృష్ణ ఇటీవలే బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఆయన గతంలో కర్ణాటక ముఖ్యమంత్రిగా, విదేశాంగ శాఖ మంత్రిగా, మహారాష్ట్ర గవర్నర్గా బాధ్యతలు నిర్వర్తించారు.