న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19 : జియో దెబ్బకు వివిధ టెలికాం సంస్థలు కూడా ఫీచర్ ఫోన్లను మార్కెట్లోకి తీసుకురావడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఎయిర్టెల్, ఐడియా సంస్థలు ఫీచర్ ఫోన్లను విడుదల చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా అదే బాటలో బీఎస్ఎన్ఎల్ కూడా ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. ఉచిత వాయిస్ కాలింగ్ సదుపాయం ఉన్న ఈ ఫోన్లను రూ.2000కే విక్రయించనున్నారు. ఈ ఫోన్ల తయారీ కోసం లావా, మైక్రోమాక్స్ సంస్థలతో ఒప్పందాన్ని కూడా కుదుర్చుకున్నట్లు సమాచారం. అంతేకాకుండా అక్టోబర్ వరకు ఈ ఫీచర్ ఫోన్ను మార్కెట్లోకి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు బీఎస్ఎన్ఎల్ చైర్మన్ అనుపమ్ శ్రీవాస్తవ వెల్లడించారు. అయితే ఈ ఫోన్ 4జీకి సపోర్ట్ చేస్తుందా? లేదా?, తయారీకి ఎంత ఖర్చు అవుతుందనే విషయాలను మాత్రం ఇంకా వెల్లడించలేదు.