న్యూయార్క్, సెప్టెంబర్ 19 : వరుసగా క్షిపణి అణ్వాయుధ పరీక్షలతో ప్రపంచానికి ముప్పుగా మారిన ఉత్తరకొరియా అణ్వాయుధ కార్యక్రమం వెనుక ఎవరి హస్తం ఉందనే అంశంపై దర్యాప్తు చేపట్టాలని అందుకు బాధ్యులైన వారిని శిక్షించాలని విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్ డిమాండ్ చేశారు. ఉత్తరకొరియా అణు పరిజ్ఞానం వెనుక పాక్ హస్తం ఉందని ఆరోపణలున్న నేపథ్యంలో సుష్మాస్వరాజ్ పరోక్షంగా దాయాది పాకిస్థాన్ ను దుశ్చర్యల్ని ఎత్తిచూపే ప్రయత్నించారు. ఐక్యరాజ్యసమితి సమావేశం కోసం అమెరికా వెళ్లిన సుష్మా అమెరికా, జపాన్ విదేశాంగ మంత్రులతో భేటీలో వివిధ అంశాలపై లోతుగా త్రైపాక్షిక చర్చలు జరిపారు. ఈ భేటీ వివరాలు మీడియాకు తెలిపిన విదేశీ వ్యవహారాల శాఖ రవీశ్కుమార్ ఉత్తరకొరియా దూకుడుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని సుష్మా డిమాండ్ చేసినట్లు వెల్లడించారు. ఉత్తరకొరియా దుందుడుకు చర్యల్ని తీవ్రంగా ఖండిచడమే కాక అణ్వాయుధ వ్యాప్తికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని సుష్మా కోరినట్లు ప్రకటించారు. పాకిస్థాన్ పేరు ప్రస్తావించ కుండానే ఆమె పరోక్షంగా ఆ దేశాన్ని ఒత్తిడికి గురి చేసే ప్రయత్నం చేసినట్లు విదేశాంగ ప్రతినిధి రవీశ్ ద్వారా తెలుస్తుంది. తీరప్రాంత భద్రత నౌకాయాన అనుసంధానం తదితర అంశాలపైన సుష్మాస్వరాజ్ అమెరికా, జపాన్ ప్రతినిధులతో చర్చించారని రవీశ్ కుమార్ తెలిపారు.