అమరావతి, సెప్టెంబరు 18: జనసేన పార్టీ అధ్యక్షుడు అక్టోబర్ నెల నుండి క్రీయాశీలక రాజకీయాల్లోకి రాబోతున్నట్లు ప్రకటించిన విషయం విదితమే. అయితే దీనికి సంబంధించిన ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పెద్దఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ భావించారు. అంతర్జాలం ద్వారా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టాలనే యోచనతో ఉన్న పవన్ నమోదు కార్యక్రమానికి అవసరమయ్యే సాఫ్ట్వేర్, యాప్స్ సాంకేతిక వివరాలపై ఆదివారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన ఐటీ విభాగం నాయకులు ఆయనకు వాటి పనితీరును వివరించారు. దీనికి సంబంధించిన ట్రయిల్రన్ సంతృప్తికరంగా ఉన్నట్లు ఐటీ విభాగం వెల్లడించింది. త్వరలోనే సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించబోతున్నట్లు పవన్ కళ్యాణ్ పార్టీ ప్రతినిధులకు తెలిపారు. కాగా, జనసేన పార్టీ 2019 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల్లోనూ పోటీ చేయనున్న నేపధ్యంలో పార్టీ బలోపేతం దిశగా అడుగులు వేస్తున్నారు.