సియోల్, సెప్టెంబర్ 17: తెలుగు తేజం పీవి సింధు కొరియా ఓపెన్ బ్యాడ్మింటన్ ఫైనల్ లో జపాన్ క్రీడాకారిణి నజోమీ ఒకుహరాపై విజయం సాధించింది. సియోల్ వేదికగా జరిగిన ఈ ఫైనల్ పోరులో తన ప్రత్యర్థి ఒకుహరను ఓడించి, సింధు టైటిల్ సొంతం చేసుకుంది. దీంతో ఇప్పటి వరకు ఏడుసార్లు నజోమీ ఒకుహరాతో తలపడిన తెలుగు తేజం మూడు విజయాలను చేజిక్కించుకుంది. అంతేకాకుండా ప్రపంచ ఛాంపియన్షిప్ ఫైనల్లో ఒకుహరా చేతిలో ఓటమి చవిచూసి సింధు ఈ మ్యాచ్తో ఆ ప్రతీకారం తీర్చుకుంది. కొరియా ఓపెన్ సిరీస్లో విజయం సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది. కాగా, నేడు జరిగిన ఈ మ్యాచ్లో తన ప్రత్యర్థి నొజోమీ ఒకుహరాపై 22-20 తేడాతో తొలి సెట్ గెలిచిన సింధు రెండో సెట్లో కాస్త తడపడి ఓడిపోయి, కీలకమైన మూడో సెట్లో పుంజుకుంది. మూడో సెట్లో పీవీ సింధు 21-18 స్కోరుతో విజయాన్ని కైవసం చేసుకుంది. దాంతో రెండు సెట్లలో గెలిచిన తెలుగుతేజం స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది.