గుండెల్ని పిండి చేసే ఈ చిత్రాన్ని చూడండి

SMTV Desk 2017-09-16 13:22:52  road accidents, warangal district, vikram,

వరంగల్ సెప్టెంబర్16: ఘోర రోడ్డు ప్రమాదానికి గురై నడి రోడ్డుపై రక్తమోడుతూ లేవలేని పరిస్థితిలో ఉండి ఎలాగైనా బతకాలనే ఆశతో చుట్టూ చేరిన జనంతో నన్నెవరైనా బ్రతికించండి అంటూ ఆర్తనాదాలు చేస్తున్నట్టు కనబడుతున్న ఈ చిత్రం లోని యువకుడి పేరు సుంచు విక్రమ్‌. ఇతడిది వరంగల్ జిల్లా సోమడి గ్రామం. విక్రమ్ అతని స్నేహితుడు శుక్రవారం మధ్యాహ్నం ద్విచక్రవాహనంలో కాజీపేట నుంచి హన్మకొండ వైపు వెళ్తున్నారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లా కేంద్రంలోని కాజీపేట వంతెన మీద అదే మార్గంలో వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది. బస్సు వెనక చక్రాలు విక్రమ్ నడుము పై భాగంపై నుండి వెళ్ళడంతో నడుము భాగం మొత్తం నుజ్జునుజ్జు అయింది. తీవ్ర రక్త స్రావంతో లేవలేని స్థితిలో ఉన్న ఈ యువకుడు ఎలాగైనా తనను బతికించాలని వేడుకుంటున్న తీరు అందరినీ కలిచి వేసింది. తన ప్రాణాలు కాపాడటానికి అతని కుటుంబ సభ్యులు చేసిన ప్రయత్నం ఫలించలేదు. వేగం వద్దు ప్రాణమే ముద్దు, వేగం కన్నా ప్రాణం మిన్న అని ప్రభుత్వాలు వాహనదారులను అప్రమత్తం చేస్తున్నా రోడ్డు ప్రమాదాలు మాత్రం ఏటేటా పెరుగుతూ వస్తున్నాయి. వాహనం నడుపుతున్నప్పుడు హెల్మెట్ ధరించకపోవడం, రోడ్డు ప్రమాణాలను పాటించక పోవడం, మద్యం తాగి వాహనం నడపడం, వేగంగా వాహనం నడపడం, నిర్లక్ష్యం ఇవన్నీ రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఇప్పటికైనా భద్రతా ప్రమాణాలను పాటించి అమూల్యమైన ప్రాణాలను కాపాడుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. తెగిపోయేటప్పుడే బంధం విలువ, చనిపోయే ముందే ప్రాణం తీపి తెలుస్తుందనడానికి పైన చిత్రమే ప్రత్యక్ష నిదర్శనం.