న్యూఢిల్లీ, సెప్టెంబర్ 16 : అత్యాచార కేసులో 20ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న డేరా సచ్చా సౌధా అధిపతి గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ నేడు మరో రెండు కేసులలో పంచకుల న్యాయస్థాన విచారణను ఎదుర్కోనున్నారు. 2002లో జరిగిన రామ్ చందర్ ఛత్రపతి అనే విలేఖరి హత్య సహా డేరా సచ్చా సౌధా మాజీ మేనేజర్ రంజిత్ సింగ్ కేసుల్లో బాబా గుర్మీత్ సింగ్ ను ప్రధాన కుట్రదారుడిగా 2003 నుంచి సీబీఐ విచారణ జరుపుతోంది. ప్రస్తుతం రోహ్ తక్ జైలులో ఖైదీగా ఉన్న గుర్మీత్ బాబా అక్కడి నుండే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పంచకుల సీబీఐ కోర్టు విచారణకు హాజరు కానున్నారు. గత నెలలో కోర్టు తీర్పు రోజు చెలరేగిన హింసాత్మక ఘటనలో 41 మంది మృతి చెందిన దృష్ట్యా హర్యానా పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. సమస్యాత్మక ప్రాంతాలైన సిర్సా పంచకులలో ఎటువంటి అలర్లు చెలరేగకుండా పారామిలటరీ బలగాలు పహారా కాస్తున్నాయి.