హైదరాబాద్ సెప్టెంబర్ 16: నగర ప్రయాణికులు రాత్రి 9 గంటల తర్వాత బస్సులు అందుబాటులో లేక ఇబ్బందులు ఎదుర్కుంటున్నామని అర్ధరాత్రి వరకు బస్సు ట్రిప్పులను నడిపించాలని అధికారులకు విన్నవించడం తెలిసిందే. ఈ మేరకు అధికారులు స్పందించి నగర ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని లేట్ నైట్ బస్సు ట్రిప్పులను నడిపించేందుకు గ్రేటర్ హైదరాబాద్ జోన్ నిర్ణయించింది. నగర ప్రయాణికుల కోసం అర్ధరాత్రి వరకు బస్సు ట్రిప్పులను నడిపించనున్నారు. ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయనే విమర్శలకు తావివ్వకుండా ట్రాఫిక్ సర్వే ఆధారంగా హయత్నగర్, ఎన్జీవో కాలనీ, ఈసీఐఎల్ ఎక్స్ రోడ్స్, కుషాయిగూడ, కాళీమందిర్, జీడిమెట్ల, సీబీఎస్, కోఠి, కొండాపూర్, సికింద్రాబాద్, మియాపూర్, లింగంపల్లి, పటాన్చెరు, బోరబండ, సుచిత్ర, మెహిదీపట్నం, తాళ్లగడ్డ, బడంగ్పేట్, ఉప్పల్ తో పాటు మరికొన్ని ప్రాంతాలకు అర్థరాత్రి వరకు బస్సులు నడిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.