హైదరాబాద్, సెప్టెంబర్ 14: వివాహాలు కుదర్చడంలో తన దైన రీతిలో ముందుకు దూసుకుపోతున్న భారత్ మ్యాట్రిమోనీ డాట్ కామ్ ఇప్పుడు భారత స్టాక్ మార్కెట్ లోనూ జోరు సాగించబోతుంది. ఐపీఓకు వచ్చిన తొలి వివాహ సంబంధాలు కుదిర్చే సంస్థగా మ్యాట్రిమోనీ స్థానాన్ని దక్కించుకుంది. వివిధ ప్రాంతాలలో కార్యాలయాలను ఏర్పాటు చేసి, అన్ని భారతీయ భాషల్లో నెటింట్లో వివాహా సంబంధాలను నిర్వహిస్తుంది. నిధుల సమీకరణ కోసం ఈ సంస్థ వారు 28 లక్షల వాటాలను విక్రయించాలని అనుకోగా, సరాసరి 1.25 కోట్ల వాటాలకు డిమాండ్ వచ్చిందంట. యూఎస్ వెంచర్ కాపిటల్ సంస్థ బెస్సెమర్ వెంచర్ పార్ట్ నర్స్ మ్యాట్రిమోనీకి నిధులందిస్తున్న విషయం విదితమే. తమ సంస్థ పురోగతి, విస్తరణ నిమిత్తం అవసరమయ్యే రూ. 500 కోట్ల నిధుల కోసం ఇన్వెస్టర్ల తలుపుతట్టగా, ఐపీఓకు దరఖాస్తుల గడువు ముగిసేసరికి 441 శాతం అదనపు సబ్ స్క్రిప్షన్ వచ్చిందని నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ గణాంకాలు తెలిపాయి. కాగా, ఈ సంవత్సరంలో ఇప్పటివరకూ 20 ఐపీఓలు మార్కెట్ ను తాకగా, అన్నీ ఓవర్ సబ్ స్క్రైయిబ్ కాగా, రెండు కంపెనీలకు మాత్రం 100 రెట్లకు పైగా స్పందన లభించడం విశేషం.