హైదరాబాద్, సెప్టెంబర్ 14: ‘భలే మంచి రోజు’, ‘శమంతకమణి’ చిత్రాలను తెరకెక్కించిన శ్రీరాం ఆదిత్య మరో సరి కొత్త కథతో మల్టీస్టారర్ చిత్రం చేయనున్నాడు. అయితే ఈ దర్శకుడు కథను అక్కినేని నాగార్జున, నేచురల్ స్టార్ నాని లకు వినిపించగా వారికి స్క్రిప్ట్ నచ్చడంతో వెంటనే ఈ చిత్రానికి ఒప్పుకున్నట్లు చిత్రవర్గాల సమాచారం. హీరో నానిని ఇప్పటివరకు లవర్ బాయ్ గా చూశాము కానీ ఈ చిత్రంలో ఇదివరకు ఎప్పుడూ చూడని గెటప్లో ఈ హీరోను చూపించనున్నారట. మరి నాగార్జున గెటప్ ఎలా ఉండబోతుందో అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ చిత్రానికి అశ్విని దత్ నిర్మాతగా వ్యవహరించనున్నారని టాక్. ఇంకా కథానాయికల ఎంపిక జరగాల్సి ఉంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే నవంబర్ లేదా డిసెంబర్లో చిత్రీకరణ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం నాని ‘ఎంసీఏ’ చిత్రంలో నటిస్తున్నారు. మరో పక్క నాగార్జున చైతన్య పెళ్లి పనులతో పాటు ‘రాజుగారి గది 2’తో బిజీగా ఉన్నారు.