అమరావతి, సెప్టెంబర్ 14: రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో యావత్ భారతదేశంలో పాగా వేయాలనే కృత నిశ్చయంతో ఉన్న కేంద్ర సర్కారు ఆ దిశగా అడుగులు వేయడం మొదలుపెట్టింది. దానిలో భాగంగా గత ఎన్నికల్లో పట్టు సాధించ లేకపోయిన దక్షిణాది రాష్ట్రాలపై భాజపా దృష్టి సారించింది. ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్ లో పార్టీని సమర్థవంతంగా నడిపించగల నాయకుడి కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. అయితే ఆంధ్రప్రదేశ్ లో అధ్యక్ష పదవి కోసమై ముగ్గురు సీనియర్ నేతల పేర్లు రేసులో ఉన్నట్లు వినిపిస్తున్నాయి. వీరిలో సోము వీర్రాజు, ఆకుల సత్యనారాయణ, కన్నా లక్ష్మి నారాయణలలో ఎవరికి అధ్యక్ష పదవి వరిస్తుందనే విషయంపై సర్వత్రా రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. కాగా, ఈ ఎన్నికల్లో కాపు సామాజిక వర్గానికి పట్టంకట్టే యోచనలో అధిష్టానం ఉన్నట్లు విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఒకవేళ ఆ సామాజిక వర్గానికే పదవి కేటాయిస్తే కాపు కులానికి చెందిన కన్నా లక్ష్మినారాయణ అధ్యక్షడు అయ్యే అవకాశం లేకపోలేదనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.