కొత్తగూడెం, సెప్టెంబర్ 14 : భద్రాచలం ఆలయానికి ఉన్న ప్రాచుర్యానికి, శ్రీ రామచంద్రునికి ఉన్న ఆదరణ దృష్ట్యా భద్రాద్రి ఆలయాన్ని దేశంలోనే ఓ అద్భుత పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు బుధవారం ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులతో ప్రగతి భవన్ లో సమీక్షించిన ఆయన దేవాలయానికి ఉత్తరం, పడమర దిక్కులలో ఉన్న స్థలాలను కలుపుకొని దాదాపు 30 ఎకరాల్లో భద్రాద్రి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని అధికారులని ఆదేశించారు. దీంతో యాదాద్రి తరహాలోనే భద్రాద్రికి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చేలా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. అలాగే, కొత్తగూడెం-భద్రాచలం మధ్య విమానాశ్రయం నిర్మాణానికి సీఎం కేసీఆర్ సన్నాహాలు చేస్తున్నారు. దీంతో కొత్తగూడెం రైలుమార్గాన్ని భద్రాచలం వరకు పొడిగించాలని ఈ మేరకు కేంద్ర రైల్వే శాఖకు ప్రతిపాదనలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.